మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం యజమాని వీఎస్ఆర్ ఏవియేషన్స్తో హెరిటేజ్ సంస్థకు అక్రమ సంబంధాలు ఉన్నాయన్న విపక్షాల ఆరోపణలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. హెరిటేజ్ సంస్థకు ఆ ఏవియేషన్ కంపెనీతో ఎలాంటి వ్యాపార భాగస్వామ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 2022లో ఆ సంస్థ తమ వద్ద ఫైనాన్స్ (రుణం) తీసుకుందని, అది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమేనని వివరించారు. ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తామని గానీ, తమ పార్టీ ఎంపీ కేంద్ర విమానయాన మంత్రి అవుతారని గానీ ఊహించడానికి తామేమీ జ్యోతిష్యులం కాదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మద్యం కుంభకోణం విషయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా లోకేష్ ఘాటుగా స్పందించారు. ‘చిల్లర దొంగలను పట్టుకుని గజదొంగలను వదిలేస్తున్నారు’ అన్న బొత్స మాటలకు స్పందిస్తూ.. ఆ గజదొంగ జగన్ మోహన్ రెడ్డేనా అని లోకేష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తమపై స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ వంటి అనేక తప్పుడు కేసులు పెట్టారని, కానీ ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అని సవాల్ విసిరారు. మద్యం స్కాంలో సిట్ విచారణ ద్వారా అసలు నిందితులు ఎవరో త్వరలోనే తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీ కార్యకలాపాలు మరియు పార్టీ సమన్వయంపై స్పందిస్తూ, ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఒక యూనివర్సిటీ తరహాలో అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి ‘ప్రిన్సిపాల్’ అని, తామంతా ‘స్టూడెంట్స్’ అని పేర్కొన్నారు. సభలో ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, పాలనలో మెళకువలు వంటి అంశాలపై ఈ రెండు రోజుల రెసిడెన్షియల్ క్లాసుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇది కేవలం రాజకీయాల కోసం కాదని, ప్రభుత్వం మరియు పార్టీ మధ్య సమన్వయం కోసం ఒక కుటుంబం అనే కాన్సెప్ట్తో సాగుతుందని ఆయన వివరించారు.