ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ: రేపే చైర్మన్ ఎన్నిక.. రంగంలోకి ప్రత్యేక అబ్జర్వర్!

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, కోరం ఉన్నప్పటికీ కొందరు అడ్డుకోవడం, మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడటం వంటి ఘటనలు కలకలం రేపాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్‌ఈసీ, మంగళవారం జరగనున్న ఎన్నిక కోసం ఒక ప్రత్యేక అబ్జర్వర్‌ను నియమించింది.

మంగళవారం ఉదయం ఎన్నికల ప్రక్రియను ప్రత్యేక అబ్జర్వర్ సమక్షంలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో, మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం మున్సిపల్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తును మోహరించింది. నిబంధనలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది. ఎస్‌ఈసీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్న ఈ ఎన్నికపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాజకీయంగా ఇక్కడ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఇబ్రహీంపట్నం బాధ్యతలను సబితా ఇంద్రారెడ్డి మరియు శంభీపూర్ రాజులకు అప్పగించి, పార్టీ కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నిక సజావుగా సాగుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *