అమెరికా శతకోటీశ్వరుడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) మృతి తర్వాత బయటపడిన రహస్య పత్రాల వివాదాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ భారత రాజకీయ తెరపైకి తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయని, బహిర్గతమైన పత్రాలలో ప్రధాని పేరు ప్రస్తావన ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కూడా ఎప్స్టీన్తో పరిచయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ ఫైల్స్లో భారత అగ్రనేతల పేర్లు ఉన్నాయన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తీవ్రంగా స్పందిస్తూ, ఆ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. 2010లో తాను ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా పనిచేస్తున్నప్పుడు ఒక సామాజిక కార్యక్రమంలో ఎప్స్టీన్ను కలిశానని, అది కేవలం వృత్తిపరమైన యాదృచ్ఛిక పరిచయం మాత్రమేనని స్పష్టం చేశారు. బయటపడిన లక్షలాది ఫైల్స్లో తన పేరు కేవలం నాలుగు లైన్లలో మాత్రమే ఉందన్నారు. రాహుల్ గాంధీ తన కుటుంబ సభ్యులకు ఉన్న అంతర్జాతీయ అనుమానాస్పద సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పూరీ మండిపడ్డారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ రాహుల్కు 24 గంటల గడువు విధించారు. ప్రధానిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను దేశం ముందు ఉంచాలని, లేనిపక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై స్పీకర్కు నోటీసు ఇస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్లమెంటులో కూడా వేడిని పెంచింది. కాంగ్రెస్ మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్పై స్వతంత్ర దర్యాప్తు జరగాలని పట్టుబడుతోంది.