సంగారెడ్డి మున్సిపాలిటీలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి పోలీసులతో బాహాబాహీకి దిగారు. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారనే ఆరోపణలతో జగ్గారెడ్డి పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇందిరా కాలనీలో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకే అభ్యర్థిని అడ్డుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చినప్పటికీ, జగ్గారెడ్డి పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. చివరకు అదనపు ఎస్పీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కరీంనగర్ జిల్లా పరిషత్ సమీపంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆరుగురు కార్యకర్తల చేతులు విరిగాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ ఘటనతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గంభీర వాతావరణం నెలకొంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలోని 11వ వార్డులో కాంగ్రెస్ మరియు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణ రాజుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ గొడవకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని గుంపులను చెదరగొట్టారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించామని, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఎస్పీ సూచించారు.