తేది:10-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
మంగళవారం రోజున మెట్పల్లి, కోరుట్ల మరియు జగిత్యాల పట్టణాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ సిబ్బందికి కేటాయించిన బాధ్యతల పంపిణీ తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్, బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని మరియు ఎన్నికల సిబ్బంది కి ఏర్పాటు చేసిన భోజనాలను స్వయంగా పరిశీలించారు. వంట మరియు భోజనాల ప్రదేశంలో పరిశుభ్రత పాటించాలని, రుచికరమైన వంటలు ఎన్నికల సిబ్బందికి అందించాలని ఆదేశించారు. భోజనాల అనంతరం ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్ లకు ఎన్నికల సామాగ్రి తో ఏర్పాటు చేసిన బస్సుల్లో సమయానికి చేరుకోవాలని, అధికారులు ఏర్పాటు చేసిన చోటనే బస చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో 5 మున్సిపాలిటీలైన జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల మరియు మెట్ పెల్లి లలో మొత్తం 136 వార్డులుండగా, 2,31,627 మంది ఓటర్లు కలరు. ఇందుకోసం మొత్తం 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 455 మంది పోలింగ్ అధికారులు, 455 మంది సహాయ అధికారులు, 1637 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి విధులు కేటాయించామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని పోలింగ్ సరళిని కలెక్టరేట్ నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 24 గంటలపాటు టోల్ ఫ్రీ 96662 34383 ఏర్పాటుచేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.