తేది:4-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్
జగిత్యాల,జిల్లా: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 8వ, 9వ తరగతి విద్యార్థులకు స్కూల్ సాయిల్ హెల్త్ కార్డ్ కార్యక్రమంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుస్థిరమైన వ్యవసాయం కోసం నేల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలోని ఐదు పాఠశాలల్లో జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం పాఠశాల ఎంపిక కావడం పాఠశాలకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ నేల ఆరోగ్యం క్షీణిస్తే పంట దిగుబడులు తగ్గిపోవడమే కాకుండా రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. నేలలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్య పోషకాలు పంటల ఎదుగుదలకు ఎంత ముఖ్యమో విద్యార్థులకు ఉదాహరణలతో వివరించారు. అలాగే రైతు స్థాయిలో మట్టి నమూనా సేకరణ విధానం, నమూనాలు తీసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నమూనాలను సరైన పద్ధతిలో భద్రపరిచి పరీక్షలకు పంపే విధానం గురించి విద్యార్థులకు. వివరించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరుగుతోందని, విద్యార్థులు కూడా వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ వినోద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.