మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు పంకజా ముండేకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె శంభాజీనగర్ నుంచి లాతూర్ వెళ్లాల్సి ఉండగా, ఆమె ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో టేకాఫ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందే తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి లోపాన్ని గుర్తించడంతో పెద్ద ప్రమాదం నివారించబడింది. దీంతో ఆమె తన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకుని, భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని కొనసాగించారు.
కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించిన విషాద ఛాయలు ఇంకా మరువక ముందే ఈ ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అజిత్ పవార్ ప్రయాణించిన ‘లియర్ జెట్ 45’ విమానం బారామతి వద్ద కూలిపోయిన ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుని, సంబంధిత విమానయాన సంస్థ ‘వీఎస్ఆర్ వెంచర్స్’పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రత్యేక ఆడిట్కు కూడా ఆదేశించింది.
వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయ నేతల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండటంతో నేతలు చాపర్లు, ప్రైవేట్ జెట్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ చార్టర్ సంస్థలు భద్రతా ప్రమాణాలను సరిగ్గా పాటిస్తున్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ విమానయాన సంస్థలు తమ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.