ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇదంతా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న ఉత్త డ్రామా అని కొట్టిపారేశారు. కేసీఆర్ను విచారించిన తీరుపై మండిపడుతూ, పైశాచిక ఆనందం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ స్థాయి నాయకుడు తెలంగాణలో మరొకరు లేరని, ఆయనను వేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7000 గ్రామాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయని, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారని గుర్తు చేశారు.
పాలనపై దృష్టి సారించకుండా సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని కేటీఆర్ విమర్శించారు. దాదాపు 60 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదని, కేవలం మూటలు అందించడానికి, కేసుల మాఫీ కోసమే ఆ పర్యటనలని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. మేడారం జాతర వంటి పెద్ద వేడుకల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల ఆగ్రహానికి గురవుతోందని అన్నారు.
ప్రభుత్వ విచారణ సంస్థలు, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేటీఆర్ హితవు పలికారు. సీపీ సజ్జనార్ వంటి అధికారులు ట్వీట్లు, లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, ఆధారాలు ఉంటే కోర్టులో పెట్టాలని సూచించారు. సింగరేణి వ్యవహారంలోనూ, ఇతర భూ దోపిడీల విషయంలోనూ కాంగ్రెస్ నాయకుల బండారం బయటపెడతామని, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.