రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ‘అరైవ్-అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ, రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. వాహనదారులు తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన హితవు పలికారు.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సుమారు 90 శాతం ప్రమాదాలు కేవలం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే జరుగుతున్నాయని ఏఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై వారందరితో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్న ఈ సదస్సులో, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. రహదారి భద్రతను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *