కేటీఆర్ వర్సెస్ సిట్..! సీపీ సజ్జనర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విచారణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల మేరకు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసులోని కీలక అంశాలపై ఆయనను సుదీర్ఘంగా విచారించినట్లు సీపీ స్పష్టం చేశారు.

 

ఈ విచారణ కేవలం అనధికారిక మరియు చట్టవిరుద్ధమైన ఫోన్ ఇంటర్‌సెప్షన్ (ట్యాపింగ్) ఆరోపణలకు సంబంధించిన కేసుకే పరిమితమని సీపీ సజ్జనర్ వివరించారు. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ప్రముఖులతో సహా వేలాది మంది పౌరులపై నిఘా పెట్టారనే విస్తృత ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. విచారణలో భాగంగా సేకరించిన సమాచారాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.

 

అదేవిధంగా, ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయవద్దని కేటీఆర్‌కు సూచించామని, అవసరమైతే విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశామని సీపీ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యా జరిగిందని, ఇందులో చట్టవ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇవి నిరాధారమైన వ్యాఖ్యలని, దర్యాప్తు సంస్థకు వీటితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

దర్యాప్తు పూర్తిగా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా, వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతోందని సీపీ సజ్జనర్ పునరుద్ఘాటించారు. ప్రజలు ధృవీకరించని లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక మార్గాల ద్వారా వెల్లడించిన వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *