తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై వెలుగుచూసిన సంచలన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన అధికారులు.. తాజాగా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు 15 నెలల పాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో సాగిన ఈ సుదీర్ఘ దర్యాప్తులో అనేక విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ తాజాగా మెమో దాఖలు చేసింది.
నిందితులుగా టీటీడీ ఉన్నతాధికారులు తాజా పరిణామాల్లో భాగంగా, 2019-24 మధ్య కాలంలో టీటీడీ కొనుగోలు విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులపై సిట్ గురిపెట్టింది. అప్పట్లో జనరల్ మేనేజర్లుగా (GM) పనిచేసిన జగదీశ్వర్రెడ్డి (A28), పి. మురళీకృష్ణ (A30), ఆర్.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం (A29)లను నిందితులుగా చేర్చారు. అలాగే.. ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్రెడ్డిని (A31) కూడా ఈ జాబితాలో చేర్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ అక్రమాలపై మొదట ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను కూడా విచారణ అనంతరం సిట్ నిందితుడిగా పేర్కొంది. వీరితో పాటు పలువురు డెయిరీ నిపుణులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను కలిపి మొత్తం 11 మందిని కొత్తగా నిందితుల జాబితాలో చేర్చారు.
అంతర్రాష్ట్ర నెట్వర్క్, కల్తీ మూలాలు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించింది. ప్రారంభంలో ఈ కేసు మూలాలు తమిళనాడులో ఉన్నాయని భావించినప్పటికీ.. లోతైన విచారణలో ఉత్తరాఖండ్కు చెందిన బోలోబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఈ కుంభకోణానికి సూత్రధారులుగా తేలారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు ,వ్యక్తులకు ఈ కల్తీ నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తు ముఖ్యాంశాలు ,అక్రమాలు సీబీఐ డీఎస్పీలు, సీఐలతో పాటు రాష్ట్రానికి చెందిన 30 మంది అధికారుల బృందం ఈ విచారణలో పాల్గొంది. కల్తీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాల కొనుగోలు ఎక్కడి నుంచి జరిగింది? టీటీడీ నుంచి అందిన నిధులు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లాయి? నెయ్యి కల్తీ అని తెలిసినా తిరుమలకు అనుమతించిన అధికారులు ఎవరు? ఈ వ్యవహారంలో ఎంత మొత్తం లంచంగా చేతులు మారింది? అనే అంశాలపై సిట్ పూర్తిస్థాయి ఆధారాలను సేకరించింది. ఇప్పటికే దాఖలైన మొదటి ఛార్జిషీటులో 24 మందిని నిందితులుగా పేర్కొనగా.. తాజాగా మరో 12 మంది హస్తం ఉన్నట్లు కోర్టుకు నివేదించారు. వైసీపీ హయాంలో టీటీడీ పెద్దలు , ఇతర అధికారుల పాత్రపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.