అత్యంత పేదల గుర్తింపు ప్రక్రియ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అత్యంత నిరుపేదలను గుర్తించే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. ఈ సర్వేలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికీ తిరిగి ప్రజల జీవన స్థితిగతులను అంచనా వేస్తారు. గ్రామస్తుల సమక్షంలోనే ప్రాథమిక జాబితా రూపొందించి, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన తర్వాతే జిల్లా కలెక్టర్లకు నివేదిక అందజేస్తారు. దీని ద్వారా రాజకీయ జోక్యం లేకుండా నిజమైన పేదలను గుర్తించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఎవరు అర్హులు? ఈ పథకం కింద కింది వర్గాల వారికి ప్రాధాన్యత లభిస్తుంది:
-
నివాసం: సొంత ఇల్లు లేదా కనీసం సెంటు స్థలం కూడా లేని వారు, మట్టి గోడల గుడిసెల్లో ఉండేవారు.
-
వృత్తి: సాగు భూమి లేని నిరుపేదలు మరియు రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబాలు.
-
సామాజిక వర్గం: ఎస్సీ, ఎస్టీలు.. ముఖ్యంగా ఆదిమ తెగలకు (PVTG) చెందిన వారు.
-
ప్రత్యేక అవసరాలు: ఒంటరి మహిళలు, నిరాశ్రయులైన వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు ట్రాన్స్జెండర్లు.
-
ఆరోగ్యం: క్యాన్సర్, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరియు పని చేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు.
ఎవరు అనర్హులు? పథకం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను విధించింది:
-
ఆదాయం: కుటుంబంలో నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ స్థిర ఆదాయం ఉన్నవారు లేదా ఆదాయపు పన్ను చెల్లించేవారు.
-
ఉద్యోగం: కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నా వారు అనర్హులే.
-
ఆస్తులు: సొంతంగా ట్రాక్టర్, కారు లేదా జీపు వంటి వాహనాలు ఉన్నవారు; 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి లేదా బోర్ బావి ఉన్నవారు.
-
రుణాలు: బ్యాంకుల నుంచి రూ.50 వేల కంటే ఎక్కువ రుణం పొందిన వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు.