అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి రణరంగంగా మారాయి. టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విసిరిన బహిరంగ చర్చ సవాల్ను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వీకరించారు. రాయలసీమ పౌరుషం, తాడిపత్రి అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. శుక్రవారం (జనవరి 16, 2026) మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి, జేసీ కుటుంబంపై ఘాటు విమర్శలు చేస్తూ తాడిపత్రి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ చర్చకు సంబంధించి కొన్ని కీలక షరతులను విధించారు. “జేసీ కుటుంబం 30 ఏళ్ల పాలన, నా 5 ఏళ్ల పాలనపై బహిరంగంగా చర్చించేందుకు నేను రెడీ. తేదీ, సమయం మీరే ఖరారు చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వండి. అయితే, ఈ చర్చకు కార్యకర్తలు కాకుండా కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరుకావాలి. మన రెండు కుటుంబాల మధ్యే ఏంటో తేల్చుకుందాం” అని ఆయన సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, తనను నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని పెద్దారెడ్డి ఆరోపించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు స్థానిక అక్రమాలపై జేసీ చేస్తున్న విమర్శలను కేతిరెడ్డి తిప్పికొట్టారు. తాడిపత్రిలో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై తాను రెండుసార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా, జేసీ అడ్డుపడటం వల్లే విచారణ జరగడం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యర్థుల బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాజా సవాల్ ప్రతిసవాల్లతో తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.