ఇండో-పాక్ మ్యాచ్ క్రేజ్: లక్షలాది మంది పోటెత్తడంతో కుప్పకూలిన ‘బుక్‌మైషో’ సర్వర్లు!

క్రీడా ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ క్రికెట్ సమరానికి ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం బుధవారం రెండో దశ విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే, విక్రయాలు మొదలైన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడంతో అధికారిక టికెటింగ్ భాగస్వామి ‘బుక్‌మైషో’ (BookMyShow) ప్లాట్‌ఫామ్ భారీ ట్రాఫిక్ వల్ల కుప్పకూలిపోయింది.

సామాన్యులకు కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఐసీసీ టికెట్ ధరలను చాలా తక్కువగా నిర్ణయించింది. భారత్‌లో టికెట్ ధర కేవలం రూ. 100 నుంచి ప్రారంభం కావడం విశేషం. అయితే బుధవారం సాయంత్రం టికెట్ల అమ్మకం మొదలవగానే చాలా మంది యూజర్లకు ‘టెక్నికల్ ఎర్రర్’ అని రాగా, మరికొందరికి నిమిషాల తరబడి వెయిటింగ్ లిస్ట్ చూపించింది. టికెట్ల కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు చివరకు ‘కమింగ్ సూన్’ అనే సందేశం కనిపించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ తన గ్రూప్ దశ మ్యాచులను ముంబై, ఢిల్లీ, కొలంబో మరియు అహ్మదాబాద్‌లలో ఆడనుంది. టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను త్వరలోనే సరిచేస్తామని, అభిమానులు అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం గమనిస్తూ ఉండాలని ఐసీసీ వర్గాలు సూచించాయి. 2016 తర్వాత మళ్లీ భారత ఉపఖండంలో ఈ టోర్నీ జరుగుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *