సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే భోగి పండుగపై విశాఖపట్నం నగర పాలక సంస్థ (GVMC) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని తారు రోడ్లు, సిమెంట్ రోడ్లపై భోగి మంటలు వేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పండుగ పేరుతో రోడ్ల మధ్యలో మంటలు వేయడం వల్ల రహదారులు దెబ్బతినడమే కాకుండా, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనను అతిక్రమించి రోడ్లపై మంటలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చాలా మంది భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ పైపులు, పాత రబ్బరు వస్తువులను వేస్తున్నారని, దీనివల్ల వెలువడే విషవాయువులతో వాతావరణం తీవ్రంగా కలుషితమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రబ్బరు వస్తువులు కరిగి రోడ్లపై పేరుకుపోవడం వల్ల వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. కేవలం కట్టెలు, పిడకలతో మాత్రమే మంటలు వేయాలని, అది కూడా మైదానాలు లేదా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు.
నగరవాసులు పర్యావరణాన్ని కాపాడుతూ పండుగను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కోరారు. రోడ్లు పాడవకుండా చూడటం ప్రతి పౌరుడి బాధ్యతని, నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పండగ ఆనందాన్ని ఇతరులకు ఇబ్బంది కలగకుండా పంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.