కరూర్ తొక్కిసలాట కేసు: నటుడు విజయ్‌కు మరోసారి సీబీఐ సమన్లు.. విచారణలో కీలక ప్రశ్నలు!

తమిళనాడులోని కరూర్‌లో గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఇప్పటికే జనవరి 12న చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో సుమారు ఆరు గంటల పాటు విచారణకు హాజరైన విజయ్‌ను అధికారులు 19 కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ తొక్కిసలాటలో 41 మంది మరణాలకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని విజయ్ విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ కేసును సీబీఐ ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది.

విజయ్ జిల్లాల పర్యటనలో భాగంగా నిర్వహించిన ఆ సభలో జనం అదుపు తప్పడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. విజయ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకోవడం వల్ల, వేచి ఉన్న జనం అసహనానికి గురై తోసుకోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, సభలో మౌలిక వసతుల కల్పనలో నిర్వాహకులు విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. అయితే విజయ్ మాత్రం ఈ ఘటన వెనుక అధికార డీఎంకే కుట్ర ఉందని, పోలీసులు జనసమూహ నిర్వహణలో విఫలమయ్యారని ప్రత్యారోపణలు చేశారు. ఈ వాదోపవాదాల నడుమ వాస్తవాలను వెలికితీసేందుకు సీబీఐ లోతైన దర్యాప్తు చేస్తోంది.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాలకు విజయ్ ఇప్పటికే పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌లో బాధితులను కలిసి ఆయన పరామర్శించారు. ఈ ఘటన తర్వాత తమిళనాడు ప్రభుత్వం రాజకీయ సభలు, ర్యాలీలపై కఠిన ఆంక్షలు విధించింది. విజయ్ తదుపరి సభలకు దాదాపు 84 షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణలో భాగంగా విజయ్ మళ్ళీ ఎప్పుడు అధికారుల ముందు హాజరుకావాలనేది ఉత్కంఠగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *