అతివేగం ప్రాణాంతకం.. వ్యక్తిగత భద్రతతోనే సురక్షిత ప్రయాణం: ఎన్‌హెచ్‌ఏఐ పీడీ మాధవి

రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాజెక్టు డైరెక్టర్ వై. మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. 37వ జాతీయ రహదారుల భద్రత మాసోత్సవంలో భాగంగా సంగారెడ్డి జిల్లా తాడ్డాన్‌పల్లి టోల్‌గేట్ వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రహదారులు నేడు ఎనిమిది లైన్లుగా విస్తరించినప్పటికీ ప్రమాదాలు తగ్గకపోవడం విచారకరమని, వాహనదారులు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని ఆమె హితవు పలికారు.

జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సూచిక బోర్డులను గమనించడం, హెల్మెట్ మరియు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి-నాందేడ్ (NH 161) రహదారిపై శివంపేట, సుల్తాన్‌పూర్ వంటి ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణంపై ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు మాధవి తెలిపారు. సుల్తాన్‌పూర్ వద్ద రహదారి విస్తరణకు అడ్డంకిగా ఉన్న ప్రార్థనా మందిరం సమస్యను పరిష్కరిస్తూ అక్కడ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, టోల్ ప్లాజాలకు సమీపంలో అండర్‌పాస్‌ల నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించారు.

హైవే పక్కన ఉండే దాబా హోటళ్లు, పెట్రోలు పంపులు మరియు పరిశ్రమల యాజమాన్యాలు ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. వాహనాలు నేరుగా హైవేపైకి రాకుండా ముందుగా సర్వీసు రోడ్లను ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే సర్వీసు రోడ్లు లేని పలు పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని, పాఠశాల విద్యార్థులకు కూడా రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *