తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మరియు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే, సీఎం ప్రసంగం ముగిసిన తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కనీసం నిరసన తెలిపేందుకు కూడా సమయం కేటాయించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ప్రజాస్వామ్య విలువలని ప్రభుత్వం కాలరాస్తోందని వారు ఈ సందర్భంగా మండిపడ్డారు.
ఈ వాకౌట్పై ప్రభుత్వం తరపున మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎవరి పేర్లను వ్యక్తిగతంగా ప్రస్తావించలేదని, అలాంటప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు అంతగా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సభను కావాలనే పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. సభలో చర్చలు అర్థవంతంగా సాగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.
అసెంబ్లీ వెలుపల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కీలకమైన మూసీ ప్రాజెక్టుపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. సీఎం ప్రసంగం తర్వాత క్లారిఫికేషన్ అడిగే అవకాశం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ వాకౌట్ పరిణామంతో అసెంబ్లీ ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.