
తేది:1-1-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఎన్సీడీలపై ఫోకస్:
2026లో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ నివారణ(Prevention), నియంత్రణ(Control), చికిత్స(treatment), పాలియేటివ్ కేర్పై(Palliative) మరింత ఫోకస్ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఎన్సీడీసీ క్లినిక్స్, డే కేర్ కేన్సర్ క్లినిక్స్ ద్వారా గ్రామాల సమీపంలోకి వైద్య సేవలను తీసుకెళ్లామని మంత్రి గుర్తు చేశారు.
ఎమర్జన్సీ కేర్:
రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ను విస్తృతం చేస్తున్నామని, 2026లో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా క్రిటికల్ కేర్ బ్లాక్స్, ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. పది నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకుని వైద్య సేవలు ప్రారంభించేలా “108 అంబులెన్స్” సర్వీసెస్ను ఎక్స్పాండ్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
కొత్త ఏడాదిలో 4 కొత్త హాస్పిటల్స్:
దశాబ్దాల ఉస్మానియా నూతన హాస్పిటల్ ఆకాంక్షను 2025లో నెరవేర్చుకున్నామని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు కొత్త భవనాలను నిర్మించుకున్నామన్నారు. 2026లో 4 కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. గుండె, కిడ్నీ జబ్బులు, కేన్సర్ వంటి మొండి వ్యాధులకు సైతం పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా ఈ హాస్పిటళ్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య విద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.మన హాస్పిటళ్లను మనమే కాపాడుకుందాం,
ప్రభుత్వ హాస్పిటళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది అని మంత్రి పేర్కొన్నారు.