పఠాన్‌చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం.

 

తేది: 26-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

పఠాన్‌చెరువు: పఠాన్‌చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 23, 2025న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డయల్‌ 100కు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్ (PC 3109) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ రోడ్డు పక్కన సుమారు 50 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ పురుషుడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు బలహీనమైన శరీర నిర్మాణం కలిగిన వ్యక్తిగా గుర్తించబడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన పసుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్టు పోలీసు నివేదికలో పేర్కొన్నారు. వైద్యులు పరిశీలించిన అనంతరం, ఆయన ముఖభాగంలో ముఖ్యంగా ముక్కు, పెదవులు, కళ్ల చుట్టూ తీవ్ర గాయాలు ఉండటంతో పాటు అధిక రక్తస్రావం జరిగినట్లు నిర్ధారించారు.
డిసెంబర్ 25, 2025 ఉదయం సుమారు 8 గంటల సమయంలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు గోసంగి పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.
బాధితుడి గుర్తింపు ఇంకా నిర్ధారణ కాకపోవడంతో, అతనికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తూ, ఘటనకు కారణమైన వాహనం మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *