వాహనదారులకు భారీ ఊరట: ఢిల్లీలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా రద్దు?

ఢిల్లీలోని లక్షలాది మంది వాహనదారులకు ఆర్థిక ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలను పూర్తిగా రద్దు చేసేందుకు ఒక ‘అమ్నెస్టీ’ (క్షమాభిక్ష) పథకాన్ని సిద్ధం చేసింది. ఈ పథకానికి సంబంధించిన ఫైల్‌ను తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వినయ్ కుమార్ సక్సేనా వద్దకు పంపించారు. ఎల్జీ సంతకం చేసిన వెంటనే, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మరియు రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జారీ చేసిన పాత చలాన్లన్నీ రద్దు కానున్నాయి.

కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు, సామాన్య ప్రజలపై ఉన్న జరిమానాల భారాన్ని తొలగించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన చలాన్లు బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ భారీ మాఫీ ద్వారా వాహనదారులు తమ రికార్డులను క్లియర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ఈ మాఫీ కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలకు మాత్రమే వర్తిస్తుందని, తీవ్రమైన నేరాలకు కాదని సమాచారం.

ఒకవైపు పాత చలాన్ల మాఫీకి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, మరోవైపు పర్యావరణ నిబంధనల విషయంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పియూసీ (PUC – పొల్యూషన్ సర్టిఫికేట్) లేని వాహనాలపై భారీగా దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏకంగా రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. గత రెండు నెలల్లోనే సుమారు 1.56 లక్షల పొల్యూషన్ చలాన్లు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలుష్య నివారణ కోసం పెట్రోల్ పంపుల వద్ద ప్రత్యేక కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *