ఢిల్లీలో కాలుష్య కోరలు: పాత వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం.. రేపటి నుంచే అమలు!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ప్రాంతం ఒక ‘గ్యాస్ ఛాంబర్’లా మారుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణలో భాగంగా డిసెంబర్ 18 నుంచి పాత వాహనాలపై కఠిన నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు ఇకపై ఢిల్లీ రోడ్లపై తిరగడానికి వీలు లేదు.

ముఖ్యంగా ఇంజిన్ ప్రమాణాల విషయంలో కోర్టు కీలక స్పష్టతనిచ్చింది. కేవలం BS-IV (భారత్ స్టేజ్ 4) మరియు అంతకంటే ఎక్కువ ప్రమాణాలు కలిగిన ఇంజిన్ వాహనాలకు మాత్రమే ఢిల్లీలో తిరిగేందుకు మినహాయింపు లభిస్తుంది. పాత BS-III ఇంజిన్ వాహనాలు కొత్త వాటితో పోలిస్తే 2.5 నుంచి 31 రెట్లు ఎక్కువ కాలుష్య కణాలను (Particulate Matter) విడుదల చేస్తున్నాయని కాలుష్య నియంత్రణ మండలి (CAQM) గణాంకాలను కోర్టు ఉటంకించింది.

ఈ నిబంధనల అమలులో ఎటువంటి గందరగోళానికి తావులేదని, పాత వాహనాల వల్ల కలిగే కాలుష్యమే శీతాకాలంలో ఢిల్లీని పొగమంచుతో ముంచెత్తుతోందని కోర్టు అభిప్రాయపడింది. దీనితో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) లేని వాహనాలకు ఇంధనం నింపకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయాన్ని తగ్గించేలా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కొత్త చర్యలను ప్రకటించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఢిల్లీలో వాయు నాణ్యత కొంత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *