బానిసత్వం అనే దురాచారం అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తోందని, డిజిటల్ వెలుగుల నీడన కూడా బలవంతపు వెట్టిచాకిరి చీకట్లు కమ్ముకున్నాయని నివేదిక చెబుతోంది. డిసెంబర్ 2ను **’అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం’**గా పాటిస్తున్న నేపథ్యంలో ఈ ఆధునిక బానిసత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మంది ప్రజలు బలవంతంగా ఆధునిక బానిసత్వ సంకెళ్లలో బంధించబడి ఉన్నారని, వీరిలో బలవంతపు శ్రమ (28 మిలియన్లు), బలవంతపు వివాహాల (22 మిలియన్లు) బాధితులు ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 2021 గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
బానిసత్వ రూపాల్లో బాల కార్మికులు (Child labor), బాల్య వివాహాలు, వెట్టిచాకిరి, శ్రమ దోపిడీ వంటివి ఉన్నాయని, కడు పేదరికాన్ని మరియు బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణాసియా, భారత్, పాకిస్థాన్, నేపాల్ వంటి దేశాల్లో పేదరికం అధికంగా ఉండటం వలన ఈ దురాచారం బలంగా వేళ్లూనుకుంది. భారతదేశంలో కూడా ఇటుక బట్టీలు, బాణాసంచా తయారీ కేంద్రాల్లో బాల్యాలు నలిగిపోవడం వంటివి డిజిటల్ యుగంలో కూడా కొనసాగడం విచారకరం.
చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ బానిసత్వ దురాచారం రెచ్చిపోతూనే ఉందని, ఇది నేర సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి భాషణాలు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు వినిపిస్తూనే ఉన్నాయని ఆచార్య బుర్ర మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బానిసత్వాన్ని బొందపెట్టని ప్రగతి నిరర్థకం అని, ఈ దురాచారాన్ని పోషిస్తున్న పౌర సమాజం మానవ విలువలను మంటగలుపుతోందని ఆయన పేర్కొన్నారు.