ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కులాలకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతిలో అన్ని బీసీ కులాలకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత గురువారం ప్రకటించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరంలోని గొల్లపూడి బీసీ భవన్లో జరిగిన సగర కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఆయన స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి సవిత ప్రసంగించారు.
అంతేకాకుండా, బీసీల కుల వృత్తులకు ఆర్థిక భరోసా కలిగించేలా ‘ఆదరణ 3.0’ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన నిధులను ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి నేతృత్వంలోనే వినియోగించనున్నట్లు ఆమె వెల్లడించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో బీసీలు అనేక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.