లెజెండరీ నటుడు ధర్మేంద్రకు నివాళి: కుటుంబ సభ్యులను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముంబైలోని డియోల్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న (నవంబర్ 24న) 89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ధర్మేంద్ర కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాద సమయంలో, ధర్మేంద్ర కుటుంబ సభ్యులను నేరుగా కలిసి అల్లు అరవింద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ధర్మేంద్ర మరణవార్త తెలియగానే, సినీ పరిశ్రమలోని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ, “లెజెండరీ నటుడు ధర్మేంద్ర గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన లక్షలాది హృదయాలను హత్తుకున్న ఒక దిగ్గజం. ఆయన కుటుంబానికి, మిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి” అని ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ వంటి దక్షిణాది అగ్రతారలు సైతం ధర్మేంద్ర మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8న 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన ధర్మేంద్ర, కొన్ని వారాల క్రితం శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం, ఇంటి వద్దే తుదిశ్వాస విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *