దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో ప్రస్తుతం జీ20 కూటమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, ఈ కారణంగానే ఈ కూటమి ఉనికి ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రపంచ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు.
మేక్రాన్ తన ప్రసంగంలో ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, ఉక్రెయిన్ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అలాగే, కొన్ని ప్రాధాన్యతలపై జీ20 సభ్య దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకుంటే ఈ కూటమి మరింత ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా, సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాకపోవడాన్ని కూడా మేక్రాన్ ప్రస్తావించారు. గతంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముందు కూడా ఆయన నాటో కూటమి బ్రెయిన్ డెడ్ అయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై మేక్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.