జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం, బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా స్పందించారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సహా మొత్తం 58 మంది బరిలో నిలిచారు.

కేటీఆర్ తన సందేశంలో, “గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. కార్యకర్తల కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

అంతేకాకుండా, అధికార పార్టీ (కాంగ్రెస్) ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పటికీ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పి వారికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *