వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు, తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్, టీవీ5, మహా టీవీ వంటి కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రసారం చేశాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిపై భక్తితో తాను చేసిన వీడియోను రాజకీయాలకు వాడుకోవడంపై మండిపడ్డ ఆయన, తాను కేవలం “అన్నప్రసాదం చాలా బాగుంది” అని మాత్రమే అన్నానని, కానీ ఆ ఛానళ్లు మాత్రం “గతంలో కంటే ఇప్పుడు బాగుంది” అని తాను అన్నట్లుగా ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఈ విధంగా తన ప్రశంసలను ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఆపాదిస్తూ ఆ మీడియా సంస్థలు ‘శునకానందం’ పొందుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
అంబటి రాంబాబు ఈ వివాదంపై పూర్తి స్పష్టత ఇచ్చారు. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమం 1985లో ప్రారంభమైందని, అప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఈ మహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా, అద్భుతంగా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులు సమర్పించిన విరాళాలతో నడిచే ఓ మహాయజ్ఞమని, ఏ ఒక్కరికో దీని ఘనత దక్కదని స్పష్టం చేశారు. కేవలం భక్తులకు ఈ గొప్పతనాన్ని తెలియజేయాలనే సదుద్దేశంతో వీడియో చేస్తే, దానిని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడం అత్యంత నీచమైన చర్య అని ఆయన అన్నారు.
గతంలో లడ్డూలపై బురద జల్లి చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని కూడా అంబటి ఆరోపించారు. ఇకపై తన యూట్యూబ్ ఛానల్ నుంచి కంటెంట్ తీసుకుని, దాన్ని వక్రీకరించి విషప్రచారం చేస్తే సహించేది లేదని, ఆయా మీడియా సంస్థలపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.