భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకోగానే, రెండు దశాబ్దాలకు పైగా ఆ కలను మోసిన దిగ్గజ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయం ఆమె జీవితకాలపు స్వప్నం నెరవేరిన మధుర క్షణం.
మిథాలీ ఎమోషనల్ పోస్ట్
రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్కు సేవ చేసిన మిథాలీ రాజ్, జట్టు విజయం సాధించిన వెంటనే తన భావోద్వేగాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “వరల్డ్ ఛాంపియన్.. భారత మహిళల జట్టు ఆ ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తుకోవడం చూడాలని నేను రెండు దశాబ్దాలకు పైగా ఈ కల చూశాను. నేడు ఆ కల ఎట్టకేలకు నిజమైంది” అని మిథాలీ ‘X’లో పోస్ట్ చేశారు.
ప్రతి త్యాగం, ప్రతి కన్నీటికి ఫలితం
ఆమె తన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, “2005లో గుండె పగిలిన బాధ నుంచి 2017లో పోరాటం వరకు.. ప్రతి కన్నీరు, ప్రతి త్యాగం, ఇక్కడ మనం ఉన్నామని నమ్మి బ్యాట్ పట్టిన ప్రతి యువతి.. ఇవన్నీ ఈ క్షణానికి దారితీశాయి. మీరు కేవలం ఒక ట్రోఫీని గెలవలేదు, భారత మహిళల క్రికెట్ కోసం కొట్టుకున్న ప్రతి హృదయాన్ని మీరు గెలిచారు. జై హింద్” అని మిథాలీ ముగించారు. జట్టు విజయోత్సవ ర్యాలీ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ట్రోఫీని మిథాలీ రాజ్ చేతికి అందించడం ద్వారా, ఈ విజయం ఆమె కృషికి దక్కిన ఫలితమేనని గుర్తించారు.