టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో నటి శిరీష లేళ్లను వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 30న హైదరాబాద్లో జరగనున్న తన వివాహానికి ఆహ్వానించేందుకు నారా రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభలేఖ అందించి ఆహ్వానించగా, అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారా రోహిత్, శిరీష లేళ్లతో తన వివాహ వేడుకలను అక్టోబర్ 25 నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహించడానికి నారా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 25న హల్దీ, 26న పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభ ముహూర్తాన రోహిత్, శిరీష ఒక్కటవ్వనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
నారా రోహిత్, శిరీషల మధ్య పరిచయం ‘ప్రతినిధి–2’ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం నుంచి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో వివాహం వాయిదా పడింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు కావడంతో, రోహిత్ స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు.