రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే డిస్పోజబుల్ కంటైనర్లను క్యాటరింగ్ సిబ్బంది మళ్లీ ఉపయోగించడానికి శుభ్రం చేస్తున్నారనే వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్గా మారింది. ఈరోడ్-జోగ్బాని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16601)లో క్యాటరింగ్ సిబ్బంది ఉపయోగించిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను వాష్ బేసిన్లో కడుగుతున్న దృశ్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఒక ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ప్రజలు ఆహార పరిశుభ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలో కనిపించిన దృశ్యం రైల్వేలోని ఆహార భద్రతా ప్రమాణాలపై అధికారుల నిర్లక్ష్యం ఉందని విమర్శలకు దారితీసింది. ఒక వ్యక్తి డిస్పోజబుల్ కంటెనర్లను వాష్ బేసిన్లో కడిగి ఒక దగ్గర పెడుతున్నట్టుగా కనిపించింది. అయితే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకుంది. ఐఆర్సీటీసీ విడుదల చేసిన ప్రకటనలో… వీడియోలో కడిగిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను తిరిగి ప్రయాణికుల భోజనానికి ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఆ పని చేసిన వ్యక్తిని వెంటనే విధుల నుంచి తొలగించగా, లైసెన్స్ను రద్దు చేసి భారీ జరిమానా విధించారు. డిస్పోజబుల్ కంటైనర్లు ఒకసారి మాత్రమే ఉపయోగించేలా ఉంటాయని దర్యాప్తులో తేలింది.
రైల్వేలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్లు క్రమం తప్పకుండా పాటించబడుతున్నాయని IRCTC గుర్తించింది. భవిష్యత్తులో ప్రయాణికుల ఆహార భద్రతను మరింతగా పెంపొందించడానికి ఐఆర్సీటీసీ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కిచెన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భోజన తయారీని పర్యవేక్షించడం, క్యాటరింగ్ సేవలకు తప్పనిసరి FSSAI ధృవీకరణ అమలు చేయడం, నిరంతర తనిఖీలు నిర్వహించడం వంటివి చేస్తున్నట్టు ఐఆర్సీటీసీ పేర్కొంది. అయినప్పటికీ, తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసిన వారు రైళ్లో తినాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.