పాకిస్థాన్ మంత్రులు ఇటీవల చేసిన కవ్వింపు వ్యాఖ్యలకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్ను శనివారం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని, పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
“పాకిస్థాన్లోని ప్రతి అంగుళం భూమి ఇప్పుడు మన బ్రహ్మోస్ పరిధిలో ఉంది” అని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణి కేవలం ఆయుధం మాత్రమే కాదని, ఇది స్వదేశీ సామర్థ్యానికి చిహ్నం అని ఆయన అభివర్ణించారు. ఐదు నెలల్లోనే ఈ యూనిట్లో క్షిపణులు తయారు చేయడంపై అభినందించారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ సైన్యం, నావికాదళం, వైమానిక దళానికి వెన్నెముకగా ఉందని ఆయన పేర్కొన్నారు.
లక్నో సాంకేతికత, పరిశ్రమల నగరంగా మారిందని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. మే 11న ఏర్పాటు చేసిన కొత్త బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ జాతీయ భద్రత వైపు ఒక శక్తివంతమైన అడుగు అన్నారు. లక్నోలోని ఈ యూనిట్ ఏటా సుమారు 100 క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేయగలదని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపు రూ. 3 వేల కోట్ల టర్నోవర్ చేస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యూపీ పరివర్తనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కారణమని ఆయన కొనియాడారు.