తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా వివరాలను ప్రకటించింది. భక్తులు తమ దర్శనం, వసతిని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా టీటీడీ తేదీలను ఖరారు చేసింది. ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించినట్లయితే టికెట్లు మంజూరవుతాయి.
నాన్-డిప్ ఆర్జిత సేవా టికెట్లు (కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ) కోటాను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి అనుబంధ దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల కానుంది. ఇక, శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 24న ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (రూ. 300) కోటాను అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల వసతికి సంబంధించిన కోటాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జనవరి నెలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ షెడ్యూల్ను పరిగణనలోకి తీసుకుని భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా తమ టికెట్లు, వసతిని ముందుగానే బుక్ చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో కోరారు.