అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు.. కార‌ణ‌మిదే..!

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయనకు చెందిన వాణిజ్య భవనంపై అనుమతులు లేకుండా పెంట్‌హౌస్ నిర్మించడమే ఇందుకు కారణం. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు.

 

వివరాల్లోకి వెళితే.. అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సుమారు వెయ్యి గజాల స్థలంలో ‘అల్లు బిజినెస్ పార్క్’ పేరుతో ఒక వాణిజ్య భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో నాలుగు అంతస్తుల నిర్మాణానికి ఆయన జీహెచ్‌ఎంసీ నుంచి అధికారికంగా అనుమతులు పొందారు. ఈ భవనం నిర్మాణం సుమారు ఏడాది క్రితమే పూర్తయింది.

 

అయితే, ఇటీవల ఈ భవనంపైన నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఒక పెంట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగారు. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన ఈ పెంట్‌హౌస్‌ను అక్రమ నిర్మాణంగా పరిగణించి, సోమవారం అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *