తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్లో జరిగిన హింసపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశారని, నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశారని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
దాడి సమయంలో టీవీ ఛానళ్లలో ప్రసారమైన వీడియోలను గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి సమర్పించారు. గతంలో వైసీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని డీజీపీ నివేదికను ఎన్హెచ్ఆర్సీకి అందించారు. ఈ నేపథ్యంలో మరోసారి తాజా దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.