బనకచర్లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. బనకచర్లకు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని… అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

సముద్రంలోకి పోయే నీటినే తాము వాడుకుంటామని చంద్రబాబు చెప్పారు. వరదను భరించాలి కానీ, వరద నీటిని వాడుకోవద్దా? అని ప్రశ్నించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు.

 

2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి 2026 జులై నాటికి నీరు ఇస్తామని చెప్పారు. రాయలసీమకు సాగునీరు అందించే హెచ్ఎన్ఎస్ఎస్ పై గత వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడిందని… తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. విదిధ రిజర్వాయర్లలో 785 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *