జీహెచ్ఎంసీలో ఏసీబీ దాడులు..! ఏఈఈ స్వరూప లంచం తీసుకుంటుండగా అరెస్ట్..

హైదరాబాద్ నగరంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

కాప్రా సర్కిల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న బి. స్వరూప, ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనులకు సంబంధించిన కొలతలను ఎం-బుక్ లో నమోదు చేయడానికి రూ.1,20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

 

బాధిత కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కాప్రాలోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై మంగళవారం దాడి చేశారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, కాంట్రాక్టర్ నుంచి ఏఈఈ స్వరూప రూ.1,20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచంగా స్వీకరించిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏఈఈ స్వరూపను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *