పంజాబ్‌‌లో పాక్ స్పై..! మరో గూఢచారి అరెస్ట్..!

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, బయ్యా సన్నీయాదవ్‌లే కాదు.. డజన్ల మంది దరిద్రులు పాకిస్తాన్‌తో అంట కాగారు. దేశ రహస్యాలను దాయాది దేశానికి అమ్మేశారు. ఒకరి తర్వాత ఒకరిని ఇంటెలిజెన్స్ వర్గాలు పట్టుకుంటున్నాయి. వారిని ప్రశ్నిస్తే.. సంచలన విషయాలే బయటపడుతున్నాయి. ఏం పోయే కాలం వాళ్లకి? డబ్బులే కావాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఇలా సైనిక సీక్రెట్స్ శత్రుదేశానికి చేరవేయడం ఏంటి దారుణం కాకపోతే. లేటెస్ట్‌గా పంజాబ్‌లో మరో పాక్‌ గూఢచారి పట్టుబట్టాడు.

పంజాబ్‌‌లో పాక్ స్పై..

తర్న్‌ తరన్‌కు చెందిన గగన్‌దీప్‌ సింగ్‌ అలియాస్‌ గగన్‌ను అరెస్ట్‌ చేశారు పంజాబ్‌ కౌంటర్ ఇంటెలిజెన్స్‌. అతడిని విచారించగా సంచలన విషయాలు బయటపెట్టాడు. పాక్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని గగన్‌.. గోపాల్ సింగ్‌కు పంపించినట్లు నిర్ధారించారు.

ఖలిస్తానీల అడ్డాగా పాక్

పాక్‌కు చెంది గోపాల్ సింగ్ చావ్లా.. లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్ సయీద్‌కు ప్రధాన అనుచరుడు. పాక్ ISI కలిసి భారత వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడంలో దిట్ట. నానక్‌ సాహిబ్‌ దర్శనానికి పాక్ వెళ్లే భారత యాత్రికులను ట్రాప్‌ చేసి, ఖలిస్తాన్‌ వేర్పాటువాదాన్ని నూరిపోస్తుంటాడు. అలాంటి కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాదితో గగన్‌దీప్‌ సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించారు పంజాబ్‌ పోలీసులు.

అంతకుమించే టార్గెట్లు స్మాష్..

మరోవైపు, ఆపరేషన్‌ సిందూర్‌పై పాక్‌ సైనిక రిపోర్ట్‌ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇండియా ప్రకటించిన దానికంటే ఎక్కువే నష్టం జరిగినట్లు పత్రాలు రివీల్ చేశాయి. మరో 8 టార్గెట్లు ధ్వంసమైనట్లు పత్రాల్లో బయటపడింది. పెషవర్‌, ఝాంగ్‌, సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌, గుజ్రాత్‌, అటోక్‌, గుజ్రన్‌వాలా, భవల్నగర్‌, ఛోర్‌పై భారత్ దాడులు చేసినట్లు రిపోర్ట్‌లో ఉంది. ఐతే భారత్ దాడుల్లో తీవ్రంగా నష్టపోవడంతోనే పాక్ సీజ్‌ఫైర్‌కు ముందుకొచ్చిందని భావిస్తున్నారు నిపుణులు. పాక్‌ నుంచే కాల్పుల విరమణ ప్రతిపాదన రావడానికి ఇదే మెయిన్‌ రీజన్‌ అని అంచనా వేస్తున్నారు.

మన లెక్క ఇదే..

పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పీవోకేతో పాటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద క్యాంపులపై ఎటాక్‌ చేసింది. బహవాల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ హెడ్‌క్వార్టర్స్‌, మురిడ్కేలోని లష్కరే తొయిబా హెడ్‌ క్వార్టర్స్‌ కూడా ధ్వంసమయ్యాయి. దాంతో పాటు ముజఫ్పరాబాద్‌, కోట్లీ, రవాల్‌కోట్‌, ఛాక్సవారి, భింబేర్‌, నీలమ్ వ్యాలీ, జీలమ్‌, ఛక్వాల్‌లోని టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసింది భారత్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *