తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు..!

తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందా? గతంలో మాదిరిగా కాకుండా నేతల నుంచి మాటలు, పనులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ వ్యవహారాలను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

పార్టీ కమిటీల్లో మహిళలకు అవకాశం ఇవ్వలేదంటూ గాంధీ భవన్‌లో ఈనెల 14న మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేపట్టారు. పదవులు నేతల బంధువులకే ఇస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ ధర్నాపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఏఐసీసీ షోకాజ్ నోటీస్​ జారీ చేసింది.

అందుకు దారి తీసిన కారణాలను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు క్షమాపణ చెప్పారు సునీతారావు.ఈ వ్యవహారంపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ధర్నా చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పారట ఆమె.

సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని సునీతారావు వివరించారు. మహిళా నేతలు వస్తే లోపలికి రాకుండా గాంధీ‌భవన్ గేట్లు వేశారంటూ సునీతా‌రావు తెలిపినట్టు సమాచారం. దానిపై ఇన్‌ఛార్జ్ మీనాక్షి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ కోసం పనిచేసివారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ని కోరినట్టు తెలుస్తోంది. అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని మీనాక్షి హామీ ఇచ్చినట్లు సునీతారావు చిట్‌చాట్‌లో మీడియాకు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో పీసీసీ కమిటీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ హైకమాండ్.

ముఖ్యమైన కమిటీలను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వ్యూహరచన వంటి అంశాలను పర్యవేక్షించేందుకు 22 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు సలహాలు ఇచ్చేందుకు 15 మందితో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది.

భవిష్యత్తులో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్టీ పరంగా చూసేందుకు ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌.

తెలంగాణలో దీన్ని సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు 16 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఏమైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు ఆరుగురు సభ్యులతో క్రమశిక్షణా చర్యల కమిటీని ఏర్పాటు చేసింది ఏఐసీసీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *