వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా..?

వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? ఏదైనా ఘటనలు జరిగితే సైలెంట్‌గా ఉండే మాజీ సీఎం, కడప ఘటనపై రియాక్ట్ వెనుక కారణమేంటి? కడపలో జరుగుతున్న మహానాడుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? లేని చట్టాన్ని గుర్తు చేస్తూ కూటమి సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.

 

కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో ఓ చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు కామాంధుడు. మద్యం సేవించి ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీనిపై అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో బాలిక పేరెంట్స్‌ని వైసీపీ నేతలు వెళ్లి కలిశారు. తమ గోడు వెల్లబోసుకున్నారు. కూతురు గురించి ఆ తల్లి మాట్లాడుతూ క‌న్నీరుమున్నీరు అయ్యింది. ఇదొక అమానుష ఘటన, నిందితుడ్ని కచ్చితంగా అరెస్టు చేసి తగిన శిక్ష విధించాల్సిందే.

 

బాధితుల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మాజీ సీఎం జగన్. ఆ వీడియోను తన ఆలోచనలను జోడించారు. రాష్ట్రంలో మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా దొరుకుతుందన్నారు. మ‌ద్యం మ‌త్తులో దుర్మార్గులు మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌ల‌కు పాల్ప‌డు తుండ‌డంపై ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడ‌డం లేదని రాసుకొచ్చారు.

 

ఘటన గురించి బాలిక త‌ల్లి క‌న్నీరుమున్నీరవుతున్నా ఈ ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌రమన్నారు. చిన్నారిని హ‌త్య చేసిన నిందితుడ్ని క‌ఠిన శిక్షప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల‌ంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో తన పాలన గురించి రెండు ముక్కలు రాసుకొచ్చారు.

 

మా హ‌యాంలో దిశ‌ వ‌ల్ల మ‌హిళ‌ల జోలికి ఎవ‌రైనా రావాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉండేదన్నారు. నేడు ‘దిశ’ లేక‌పోవ‌డంతో మ‌హిళ‌ల మాన‌ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందన్నారు. అసలు దిశ చట్టం లేదని కూటమి సర్కార్ పదేపదే చెబుతోంది. లేని చట్టాన్ని ఉందని ఎలా చెబుతున్నారని గతంలోనే కూటమి మంత్రులు దుమ్మెత్తిపోశారు. అయినా వైసీపీ అధినేత పదేపదే ఆయన తన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

 

మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి జగన్ తన ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. లిక్కర్ కేసు, పథకాలు ఇలా ఏది తీసుకున్నా వైసీపీ ప్రభుత్వం మంచి చేసిందంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత మంచి చేస్తే కేవలం 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో ఆయనకే తెలియాలి.

 

ప్రస్తుతం కడపలో మహానాడు జరుగుతోందని, దానిపై బురద జల్లేందుకు ఈ విధంగా జగన్ రాసుకొచ్చారని అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. ఈ విషయంలో జగన్ నేరుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని అంటున్నారు. కేవలం కార్యకర్తల విషయంలో ఆయన బయటకు వస్తున్నారని, సామాన్యుల విషయంలో ఇలాంటి కామెంట్స్‌తో సరిపెడుతున్నారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *