రేవంత్ రెడ్డి, కవిత మంచి ఫ్రెండ్స్: ధర్మపురి అర్వింద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచి స్నేహితులని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కానీ, ప్రస్తుతం సీఎంగా ఉన్న తరుణంలో కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడూ కవితను విమర్శించలేదని ఆయన గుర్తుచేశారు.

 

కేసీఆర్ తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం వల్లే బీఆర్ఎస్‌కు ఈ దుస్థితి పట్టిందని అర్వింద్ అన్నారు. నిజానికి, కేసీఆర్ తర్వాత పార్టీలో ఆ స్థానం హరీశ్ రావుదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎంతో తెలివైన రాజకీయ నాయకుడని, ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడినా వారికి అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని ఆయనకు తెలుసని, అందుకే బీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదని అర్వింద్ అన్నారు. ఈ విషయం కవితకు తెలియదని వ్యాఖ్యానించారు.

 

అయితే, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కేసీఆర్‌ను అర్వింద్ ప్రశంసించారు. కేసీఆర్ పదమూడేళ్ల పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమైందని, అందరినీ కలుపుకొనిపోయే నాయకుడిగా ఆయన వ్యవహరించారని కొనియాడారు. ఆంధ్రా నేతలను తట్టుకుని రాష్ట్రాన్ని సాధించడం కేసీఆర్‌కే సాధ్యమైందని, లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదని స్పష్టం చేశారు. తాము ఎన్ని విమర్శలు చేసినా, ఈ విషయంలో కేసీఆర్ ఘనతను కాదనలేమని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష బలంగా ఉందని, ఆ వాదాన్ని కేసీఆర్ తన వాగ్ధాటితో, విషయ పరిజ్ఞానంతో సమర్థంగా ముందుకు తీసుకెళ్లారని అర్వింద్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *