పాక్ కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) హాట్‌లైన్‌లో చర్చలు జరిపారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం పదేపదే రెచ్చగొట్టే విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని భారత్ ఈ సందర్భంగా పాక్‌ను గట్టిగా హెచ్చరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.

 

గత ఆరు రోజులుగా ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్, తాజాగా జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

 

ఏప్రిల్ 29-30 రాత్రులతో పాటు, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి, పర్గ్వాల్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు పాల్పడిందని, భారత సైనిక బలగాలు దీనికి తగిన రీతిలో స్పందించాయని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులు జరగడం అరుదని, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తీవ్రతరం చేసిందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *