నాసా-ఇస్రో మిషన్‌లో అంతరిక్ష యాత్రకు భారత ఐఏఎఫ్ పైలట్..

భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. మే 29న ప్రయోగించనున్న యాక్సియమ్ మిషన్ 4కు ఆయన పైలట్‌గా వ్యవహరిస్తారని యాక్సియమ్ స్పేస్ ఇంక్ మంగళవారం ప్రకటించింది.

 

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రైవేట్ వ్యోమగామి యాత్ర, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభం కానుంది. మే 29న, భారత కాలమానం ప్రకారం రాత్రి 10:33 గంటలకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుక్లా బృందం నింగికి బయలుదేరుతుంది. ఈ యాత్రలో శుక్లాతో పాటు మిషన్ కమాండర్‌గా మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు సభ్యులుగా ఉన్నారు.

 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక, శుక్లా బృందం అక్కడ సుమారు 14 రోజుల పాటు గడపనుంది. ఈ సమయంలో వారు పలు శాస్త్రీయ పరిశోధనలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ, స్పేస్ బయో-మాన్యుఫాక్చరింగ్, బయో-ఆస్ట్రోనాటిక్స్‌పై దృష్టి సారిస్తారని గతంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇస్రో చేపడుతున్న గగన్‌యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి భవిష్యత్ ప్రయోగాలకు అవసరమైన మానవ సహిత అంతరిక్ష యాత్రల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *