ఎట్టకేలకు డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తులు సమయంలో సాఫ్ట్వేర్లో లేనిపోని సమస్యలు తలెత్తాయి. చాలామంది ఇబ్బందులుపడ్డారు. చివరకు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇదే విషయాన్ని ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఏపీలో డీఎస్సీకి ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థుల దరఖాస్తు విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనివల్ల చాలామంది అభ్యర్థుల దరఖాస్తులు రిజక్ట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు అభ్యర్థులు. రోజురోజుకూ సమస్య జఠిలం కావడంతో ఈ విషయం మంత్రి నారా లోకేష్ చెవిలో పడింది. వెంటనే దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు.
మంత్రి క్లారిటీ
అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచన చేశారు మంత్రి నారా లోకేష్. దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం కేవలం ఆప్షనల్ మాత్రమేనని అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో కచ్చితంగా ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఒక విధంగా అభ్యర్థులకు ఊహించని రిలీఫ్ అన్నమాట.
ఎందుకంటే విద్యార్హత సర్టిఫికెట్లు, ఇంకోవైపు కుల, నివాస ధృవీకరణ పత్రాలు. ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే సమయంలో అభ్యర్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని భావించారు మంత్రి లోకేష్. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అసలు సమస్య ఏంటి?
స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లీష్, తెలుగుతోపాటు ఇతర భాషా పండితుల ఉద్యోగాలకు అర్హత డిగ్రీ లేదా పీజీ. జనరల్ కేటగిరి అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 45 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో డిగ్రీలో 50 లేదా 45 శాతం మార్కులు ఉండాలి. అప్పుడు మాత్రమే పీజీ అర్హత ఉన్నవారి దరఖాస్తులు తీసుకుంటోంది. లేకుంటే రిజెక్ట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల నిబంధనల్లో సడలింపు చేసింది. ఆపై ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 40 శాతంగా నిర్ణయించింది. తొలుత 45 నుంచి 50 శాతం మార్కుల ఉండాలని నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం.
ఈ నిబంధన వల్ల లక్షలాది మందికి దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై ఇంటా బయటా రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. చివరకు అర్హత మార్కులను కుదించింది ప్రభుత్వం. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉద్యోగాల విద్యార్హతల విషయంలో కొంత గందరగోళం లేకపోలేదు.
బీసీఏ అభ్యర్థులను అనుమతించింది.. బీఎస్సీ కంప్యూటర్స్ చేసినవాళ్లను అనుమతించడం లేదు. బీసీఏ చదివిన వారిని అనుమతించడంపై అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 16, 347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి సర్కార్. అందులో 80 శాతం స్థానికులతో భర్తీ చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం. విద్యాశాఖ పరిదిలో 13,661 పోస్టులు.. బీసీ, ఎస్టీ, ఎస్సీ విభాగంలో మిగతా పోస్టులు ఉన్నాయి.