ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసింది కూటమి సర్కార్. టీచర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ను ఆదివారం విడుదల చేయనుంది పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీ షెడ్యూల్ను ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు మంత్రి నారా లోకేష్.
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల సాకారం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విద్యాశాఖ విడుదల కానుంది. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచింది.
ఏయే పోస్టులు ఎక్కెడెక్కడ?
ఈ విషయాన్ని డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో 259 పోస్టులు కాగా, జోనల్ స్థాయిలో 2 వేల పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో 14,088 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు నియామకాలు చేపట్టారు.
పైవాటితోపాటు బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో భర్తీ చేయనుంది ప్రభుత్వం. SGT పోస్టులు-6,599, SCHOOL అసిస్టెంట్లు- 7,487, వ్యాయామ, ఉపాధ్యాయ పోస్టులంతా 14,088 ఖాళీలు ఉన్నాయి. ఇక జోన్ల విషయానికి వద్దాం.
జోన్-1లో- 400, జోన్-2లో- 348, జోన్-3లో- 570, జోన్-4లో- 682 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలు- 881, జువెనైల్ పాఠశాలలు-15, అంధుల పాఠశాలలు-31 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్-1లో ఇంగ్లీష్లో నైపుణ్య పరీక్ష ఉంటుంది.
ఇక ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు రావాలి. అప్పుడు అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. అందులో అర్హత సాధిస్తేనే పేపర్-2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉండనుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ద్వారా వెయిటేజీ 20 శాతం ఉండనుంది.
ఈ తేదీలు మరిచిపోవచ్చు
ఇక షెడ్యూల్ విషయానికొద్దాం. ఆగష్టు నాటికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలకు రానున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తారు. మే 20 నుంచి నమూనా పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 30 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ కార్యక్రమం మొదలుకానుంది. పరీక్షలు మాత్రం జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనున్నాయి.
పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తుంది ప్రభుత్వం. వారం తర్వాత అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరిస్తుంది. దాని గడువు ముగిసిన వారానికి తుది ‘కీ’ విడుదల చేయనుంది. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన ఇవ్వనుంది. ఈ తతంగం పూర్తి అయ్యేసరికి ఆగష్టు లేదా సెప్టెంబర్ కావచ్చని అంటున్నారు.