ఢిల్లీ రేఖా గుప్తాకే ఛాన్స్ ఎందుకు..? బ్యాగ్రౌండ్ ఏంటి..?

హస్తిన సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరనే సస్పెన్స్ కి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను కన్ఫర్మ్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

రాజకీయ అనుభవం..

 

విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం ఆమె ఎంతగానో కృషిచేశారు. రేఖా గుప్తాకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కూడా రేఖా గుప్తా రెండుస్తారు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా.. ఆ తర్వాత మేయర్‌గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు.

ఎమ్మెల్యేగా..

 

ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

 

సంఘ్ నేపధ్యం..

 

రేఖాగుప్తాను సీఎంగా ఎన్నుకోవడానికి ఆమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం కూడా బాగా కలిసొచ్చింది అని చెబుతున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు.

 

కుటుంబ నేపధ్యం..

 

ప్రస్తుతం రేఖా గుప్తా వయస్సు 50 ఏళ్లు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పని చేశారు. రేఖ కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది.

 

విద్యాభ్యాసం..

 

1995-96లో ఆమె LLB పూర్తిచేశారు. తన చదువు పూర్తయిన తర్వాత 2003-04లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్‌లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.

 

ఇక కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుక రాంలీలా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుండగా ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *