10 కాదు.. 20 కాదు.. ఏకంగా 700 కోట్ల కుంభకోణం. వైసీపీ హయాంలో.. ఆంధ్రప్రదేశ్లో వందల ఎకరాల భూముల్ని కొట్టేశారు. లిటిగేషన్ భూములు, అడ్డగోలు రిజిస్ట్రేషన్లతో.. కోట్లు కొల్లగట్టారు. ఈ వ్యవహారంలో ఓ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్.. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖతో.. మొత్తం డొంక కదులుతోంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్లో.. ప్రధానంగా మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ పేరే వినిపిస్తోంది. దందాలు, సెటిల్మెంట్లతో.. ఎంత నొక్కాలో అంత నొక్కినట్లు తెలుస్తోంది.
బిగ్ టీవీ వెలికి తీసిన 700 కోట్ల భూ కుంభకోణంపై వైఎస్సార్సీపీ(YSRCP) అగ్ర నేతలు ఉలిక్కిపడ్డారు. ఈ స్కామ్ విషయంలో తప్పు జరగలేదనో.. జరిగిందనో.. ఏమాత్రం స్పష్టత ఇవ్వలేని స్థితికి వైసీపీ (YCP) నేతలు చేరుకున్నారు. ఈ స్కామ్లో మాజీ సీఎం జగన్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కోవటంతో.. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసీపీ( YCP) నేతలు.
మరోవైపు 700 కోట్ల రూపాయల విలువైన భూకుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. అయితే, ఈ విషయంలో చంద్రబాబుకు లేఖ రాసి 5 నెలలు అయినప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదు. బిగ్ టీవీ వార్తా కథనాన్ని ప్రసారం చేయటంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆగమేఘాలపై లోతైన విచారణ చేపట్టింది.
ఇప్పటికే విజయవాడ సిటీలో ఉన్న మూడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలో ఉన్న సమాచారం మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల డేటా స్వాధీనం చేసుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా పలుచోట్ల తనిఖీలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకోనున్నారు.
మరోవైపు ఈ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ బయటపడింది. అవినీతిరులను ట్రాప్ చేసే ఏసీబీనే.. కేటుగాళ్లు ట్రాప్ చేసేశారు. ఓ డీజీ అల్లుడిని హనీట్రాప్ చేసి కీలక ఫైల్స్ తెప్పించుకున్నారు చీమకుర్తి శ్రీకాంత్. వాటిని ఎలా సంపాదించాడో సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్కు పూసగుచ్చినట్లు వివరించాడు. ఇద్దరి సంభాషణల్లో రాహుల్ అనే పేరు బయటికు వచ్చింది. డీజీ అల్లుడు రాహుల్కు అమ్మాయిలను ఎరగా వేసి.. ఫైల్స్ సంపాదించానని శ్రీకాంత్ ధర్మసింగ్తో చెప్పాడు. వాళ్లిద్దరి ఫోన్ కాల్ సంభాషణ బిగ్ టీవీ చేతికి వచ్చింది.
అసలు ఈ కేసుతో రాహుల్కు సంబంధం ఏంటి? ఏసీబీ నుంచి నిందితుల చేతుల్లోకి ఫైల్స్ ఎలా వెళ్లాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది. ఏసీబీలో ఏం జరుగుతోందో… ధర్మసింగ్ సింగ్, శ్రీకాంత్ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ అయితే ఏసీబీకి దొరకకుండా ఏడాది కాలం తప్పించుకుని తిరిగాడు. భారీ భూ స్కామ్ను వెలుగులోకి తెచ్చిన బిగ్ టీవీ కథనంతో అధికార యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. బిగ్ టీవీ కథనాలపై CMO అధికారులు కూడా ఆరా తీశారు.