జమ్మూకశ్మీర్ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్, కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రదర్శించి, ఉగ్రవాదులను, రాళ్లురువ్వే వారిని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత వరకూ ఇండియా గడ్డపై ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ సాహసించలేరన్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం చివరి రోజు సోమవారం కిష్త్వార్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదానికి ఎందరో అమరులయ్యారని, ఉగ్రవాదాన్నిఉక్కుపాదంతో సమూలంగా తుడిచిపెడతామని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ను స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను 2019 ఆగస్టులో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే రద్దు చేసిందని, ఇక ఆ చరిత్ర ముగిసిపోయందన్నారు. కాగా, 90 మంది సభ్యులున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.